- రైతులతో నెగోషియేషన్ కమిటీ సమావేశం
- ఎకరాకు రూ.20 లక్షల పరిహారం : ఎమ్మెల్యే జీఎంఆర్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : దేవరకద్ర నియోజకవర్గంలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలో మరో ముందడుగు పడింది. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్, ఆర్డీఓ, సంబంధిత అధికారులు, బసాయిపల్లి, చౌదర్పల్లి, జీనుగురాల గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులతో నిర్వహించిన నెగోషియేషన్ కమిటీ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాజెక్టు కోసం భూములు ఇవ్వనున్న రైతులతో ఎమ్మెల్యే చర్చించారు.
రైతుల సమస్యలు, భూసేకరణకు సంబంధించిన అంశాలను తెలుసుకుని, వారికి న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటైతే దేవరకద్రతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
